టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఇచ్చిన కౌంటర్ అటాక్తో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి బీజేపీని అడ్డంగా బుక్ చేశారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణభవన్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, డాటా ఎంట్రీ, కమిటీల ఎన్నికలు, జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాల స్థితిగతులపై కేటీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు తమ లక్ష్యం కాదని కిషన్రెడ్డి అన్న మాటలతోనే ఆ పార్టీ బలమేమిటో అర్థమవుతున్నదన్నారు. బీజేపీతో అయ్యేదేంలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు ఎంపీలు స్థానాలు గెలిచిన బీజేపీ.. ఆ తరువాత జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో ఏడు జెడ్పీటీసీలకే పరిమితమైందని గుర్తుచేశారు.
తెలంగాణ ప్రభుత్వంపై అసత్యప్రచారంతోపాటు, రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టాలని బీజేపీ నేతలు చూస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆగస్టు నెలాఖరుకల్లా పార్టీ కమిటీలన్నింటి ఎన్నికలను పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. ఆయుష్మాన్ భారత్ పథకం తెలంగాణలో అమలుచేయడంలేదంటూ తప్పుడు ప్రచారంచేస్తున్నారని, ఈ పథకంకంటే ఆరోగ్యశ్రీ అన్నివిధాలుగా మెరుగ్గా ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని పథకానికి ఉద్యోగులు, జర్నలిస్టులతోపాటు మరో 75 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారని తెలిపారు. ఆయుష్మాన్భారత్ పథకం కింద 25లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ఆరోగ్యశ్రీ కింద 75 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని అన్నారు.