ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం, నారాయణపురం గ్రామంలో మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహస్ర చండీయాగాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు సహస్ర చండీయాగానికి ముఖ్యఅతిధిగా విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లు విచ్చేశారు. స్వామిజీలకు వేదమంతోచ్ఛారణల మధ్య, పూలవర్షం కురిపిస్తూ, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు స్వామివార్లకు ఎదురేగి పూలమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి, యాగశాలకు తీసుకువెళ్లారు. స్వామివార్ల ఆగమనం సందర్భంగా యాగశాలకు వేలాదిగా భక్తులు పోటెత్తారు. స్వరూపానందేంద్ర స్వామివారు భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మొత్తంగా సహస్ర చండీయాగానికి స్వయంగా విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి హాజరు కావడంతో నారాయణపురంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. స్వామివార్ల రాక సందర్భంగా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)తో పాటు ఇతర రాజకీయ ప్రముఖులు, భక్తులు, హిందూ ధర్మ ప్రచారయాత్ర సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
