నైతిక విలువల అంశాన్ని పాఠ్యఅంశంగా తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని మిషన్ ఎథిక్స్ ఇండియా సొసైటీ అభిప్రాయ పడింది. ఆ సొసైటీ అధ్యక్షుడు, ఎన్ ఐ ఆర్డీ డీజీ ఓఎస్డీ కేసిపెద్ది నరసింహా రాజు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం శుక్రవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో భేటీ అయింది. నైతిక విలువల అంశం పాఠ్యఅంశంగా పెట్టాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం నేటి తరానికి గొప్ప వరం కానుందని వారు అభిప్రాయ పడ్డారు. నైతిక విలువలు కొరవడటం వల్ల సమాజంలో చిన్నారులు, మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోందని వారు వినోద్ కుమార్ కు తెలిపారు.
చరిత్రలో అశోక చక్రవర్తి చెట్లు నటించడం, చెరువులను తవ్వించడం వంటి చేసిన కార్యక్రమాలను ప్రస్తుత కాలంలో సీఎం కేసీఆర్ హరితహారం, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలను ఆచరించి చూపుతూ దేశానికే ఆదర్శంగా నిలిచారన్న విషయాన్ని వారు వినోద్ కుమార్ తో పంచుకున్నారు. నైతిక విలువలు బోధించాలన్న చారిత్రాత్మక నిర్ణయం అశోక చక్రవర్తి కార్యక్రమాలను మించి ఉన్నాయని సొసైటీ ప్రతినిధులు అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ నైతిక విలువల అంశాన్ని పాఠ్యఅంశంగా తీసుకుని రావాలన్న నిర్ణయంతో సీఎం కేసీఆర్ దేశానికే దిక్సూచిగా నిలిచారని అన్నారు. వినూత్న నిర్ణయాలతో సీఎం కేసీఆర్ ప్రస్తుత తరానికి అశోక చక్రవర్తిగా మారారని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత పాఠ్యఅంశాల్లో జనరల్ సైన్స్, సోషల్ సహా మరికొన్ని సబ్జెక్టు లలో సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు. సైన్సు లో పర్యావరణానికి సంబంధించిన అంశాలను చేర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. సోషల్ లో చరిత్ర కు సంబంధించిన పలు విషయాలు చేర్చాల్సి ఉందన్నారు. ఎల్కేజి నుంచి 5వ తరగతి పిల్లలకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ విషయాలను బోధించాల్సిన అవసరం ఉందని, తద్వారా చిన్నారులపై జరిగే లైంగిక దాడులను నివారించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. ఈ పద్దతి పాశ్చ్యాత్య దేశాల్లో అమల్లో ఉందన్నారు.