తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం అద్భుతమైన కార్యక్రమం అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశంసించారు . శాసనసభలో హరితహారంపై చర్చ సందర్భంగా ఓవైసీ మాట్లాడారు. సమైక్య పాలనలో అడవులు అంతరించిపోయాయని గుర్తు చేశారు. అడవులను ఇష్టానుసారంగా నరికినా గత పాలకులు పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పుడు మళ్లీ పచ్చదనాన్ని చిగురింపజేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ఓవైసీ. ఆరంభం నుంచే హరితహారం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పారు. 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం గొప్ప విషయమన్నారు. 2016 సంవత్సరంతో పాటు ఈ ఏడాది మంచి వర్షపాతం నమోదైందన్నారు.
