విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ స్మాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తొలిసారిగా తెలంగాణ ధర్మ ప్రచార యాత్రను చేపట్టారు. ఈ మేరకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు ఉమ్మడివరంగల్ జిల్లాలో స్వామివారు పర్యటిస్తున్నారు. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు హన్మకొండలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు నివాసంలో నిర్వహిస్తున్న నవరాత్రుల ఉత్సవాలలో రాజశ్యామల అమ్మవారికి పీఠపూజ , అర్చన, హారతి, చండీ హోమం, చండీ పారాయణ, దుర్గా పూజ, గౌరీ పూజ, లలితా సహస్ర నామార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారు స్వయంగా తీర్థ ప్రసాదాలు ఇచ్చి భక్తులను ఆశీర్వదించి, అనుగ్రహ భాషణం చేస్తున్నారు. కాగా కెప్టెన్ ఇంట్లో స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని, ఆశీర్వాదం తీసుకుంటున్నారు, ఈ క్రమంలో ఇవాళ కెప్టెన్ ఇంట్లో కరీంనగర్ మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ వినోద్కుమార్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ తదితర నేతలు స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీస్కుమార్, ధర్మ ప్రచారయాత్ర సమన్వయకర్త , దరువు, కరన్ కాన్సెప్ట్స్ అధినేత చెరుకు కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.