ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం పెద్దపల్లి జిల్లా మేడారం(ప్యాకేజీ 6), కరీంనగర్ జిల్లా రామడుగు(ప్యాకేజీ 8) ప్రాంతాల్లో భూగర్భంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.
ఈ రెండు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న సొరంగాలను, పంప్ హౌజ్లను, సర్జ్పూల్స్ను, సబ్స్టేషన్లను, స్విచ్యార్డులను సీఎం పరిశీలించారు. మేడిగడ్డ వద్ద ఎత్తిపోసిన నీరు అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లి చేరుతుంది. ఎల్లంపల్లి నుంచి 9.53 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా మేడారం గ్రామ పరిధిలోని భూగర్భ సర్జిపూల్కు చేరుతుంది. 9.53 కిలోమీటర్ల సొరంగం(టన్నెల్ను), పది డయామీటర్ల డి ఆకారపు వ్యాసార్థంలో నిర్మించారు. ఈ నిర్మాణ పనులన్నింటీనీ సీఎం క్షుణ్ణంగా పరిశీలించారు.పంపుసెట్ల తయారీ బాధ్యతలు తీసుకున్న బీహెచ్ఈఎల్ అధికారులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు.
కన్నెపల్లి వద్ద నీటి పంపింగ్ జరిగిన తర్వాత అన్నారం, సుందిల్ల ద్వారా మేడారం వరకు చేరే నీటిని 105 మీటర్ల మేర లిఫ్ట్ చేయడం అత్యంత ముఖ్యమైన ఘట్టమని సీఎం కేసీఆర్ అన్నారు. వేసవి లోగా అన్ని పనులు పూర్తి చేసి నీటి లిఫ్ట్కు, పంపింగ్కు సిద్ధం కావాలని సీఎం సూచించారు. మేడారం నుంచి రామడుగు వరకు జరుగుతున్న పనులను కూడా సీఎం పరిశీలించారు.మేడారం, లక్ష్మీపూర్ ద్వారా లిఫ్ట్ చేసిన నీటిని వరద కాల్వలో 99వ కిలోమీటర్ వద్ద కలపాలని సీఎం సూచించారు. ప్రతీ రోజు 2 టీఎంసీల నీటిని పంప్ చేయడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వచ్చే వర్షాకాలం నుంచి వీలైనంత మేర నీటిని గోదావరి నుంచి తీసుకోవాలని సీఎం చెప్పారు. వరద కాల్వ ద్వారా ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి, మరో టీఎంసీని మిడ్ మానేరకు పంపాలని సీఎం సూచించారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి వరద కాల్వ దాకా నీరు చేరే ప్రక్రియ కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైనదని, అన్ని పనులు నిర్ణీత లక్ష్యంలోగా పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. పనులను పరిశీలించే సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులు, ఇంజినీర్లు, వర్క్ ఏజెన్సీలతో మాట్లాడి.. తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.
రేపు ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అన్ని శాఖల అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు హాజరు కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పనులు సీజన్లోగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.