తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని ఈవోడీబీతోపాటు ఐటీ, ఫార్మారంగాల్లో ముందుందని యూపీ పరిశ్రమల శాఖ అధికారులు అన్నారు. ఐటీ, ఫార్మారంగాలు కొత్త పరిశ్రమలను అకర్షించడంలో దూసుకుపోతున్నాయని చెప్పారు. సినీ పరిశ్రమ ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు అయిన విషయాన్ని ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఫిబ్రవరి 21-22 తేదీల్లో పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా మంగళవారం హైదరాబాద్లో యూపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రోడ్షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సతీశ్మహానా, సీఎంవో స్పెషల్ సెక్రటరీ అమిత్సింగ్, రాష్ట్ర మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సంస్థ కమిషనర్ డాక్టర్ అనూప్చంద్రపాండే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అదనపు ముఖ్య కార్యదర్శి సంజీవ్సరన్, ఖాదీ విలేజ్ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి నవనీత్ సింఘాల్, గ్రేటర్ నోయిడా సీఈవో దేబాశిష్ పాండే, యూపీ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఎండీ రణవీర్ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఐఐ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సతీశ్మహానా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతున్నాయని అన్నారు. గతంలో పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య అగాధం ఉండేదని, కానీ, ప్రస్తుతం యూపీ మారుతున్నదని, రాష్ట్రం పట్ల అభిప్రాయం కూడా గణనీయంగా మారుతున్నదని చెప్పారు. ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ నాయకత్వంలో అభివృద్ధిలో యూపీ ముందుందన్నారు. యూపీలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఇక్కడి పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు. ‘టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు హైదరాబాద్ పెట్టింది పేరు. ఇక్కడి ప్రముఖ కంపెనీలు ఉత్తరప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నాం’ అని చెప్పారు.
యూపీ రాష్ట్ర మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సంస్థ కమిషనర్ డాక్టర్ అనూప్ చంద్రపాండే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, ఈవోడీబీలోనూ ముందుందున్నారు. ఐటీ, ఫార్మారంగాలు, కొత్త పరిశ్రమలను ఆకర్షించడంలో దూసుకపోతున్నాయన్నారు. హైదరాబాద్లో ఉన్న టీహబ్ తరహాలో దాదాపు రెండువేల స్టార్టప్లకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరిలో లక్నోలో జరిగే పెట్టుబడిదారుల సదస్సు ద్వారా రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. ఇవే కాకుండా రాబోయే ఐదేండ్లలో ఉత్తరప్రదేశ్లో 20లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రూ.5లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. ఇక్కడి పరిశ్రమలను తరలించకుపోవడం తమ రాష్ట్రంలో నిర్వహిస్తున్న పెట్టుబడిదారుల సదస్సు ఉద్దేశం కాదని స్పష్టంచేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అదనపు ముఖ్య కార్యదర్శి సంజీవ్ సరన్ మాట్లాడుతూ హైదరాబాద్ సినీ పరిశ్రమకు మంచి పేరు ఉందని, ఇక్కడ అనేక వసతులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ సినీపరిశ్రమను ఆకర్షించడానికి వచ్చే నెలలో కొత్త విధానాన్ని విడుదల చేస్తామని తెలిపారు.