‘తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి’ పేరిట రాష్ట్రంలో కొత్త కార్పొరేషన్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. వ్యవసాయాభివృద్ధి -రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయికి తీసుకుపోవడంలో ఈ కార్పొరేషన్ కృషి చేస్తుందని ప్రకటించారు. లాభాపేక్ష లేని సంస్థ (నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్)లాగా ఈ కార్పొరేషన్ పనిచేస్తుందని, ఈ సంస్థకు సమకూరిన నిధులను ఈ సంస్థ ఏర్పాటు చేసిన లక్ష్యాల సాధన కోసమే వినియోగిస్తారని స్పష్టం చేశారు. గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల మాదిరిగానే త్వరలోనే జిల్లా, రాష్ట్ర స్థాయి రైతు సమన్వయ సమితులు ఏర్పాటవుతాయని వెల్లడించారు.
SEE ALSO : మంత్రి కేటీఆర్కు నాస్కాం కాబోయే అధ్యక్షురాలి అనూహ్య ప్రశంస
రైతు సమన్వయ సమితుల నిర్మాణం, విధులు, బాధ్యతలను నిర్ణయించడంతో పాటు, ఈ నెల 25,26 తేదీల్లో నిర్వహించే ప్రాంతీయ సదస్సులపై గురువారం ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు పోచారం శ్రీనివాస రెడ్డి, ఈటెల రాజెందర్, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపిలు బి.వినోద్ కుమార్, గుత్తా సుఖేందర్ రెడ్డి, బాల్క సుమన్, అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
SEE ALSO : గోషామహల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం..పోచంపల్లి
విత్తనం వేసిన దగ్గర నుంచి పంటకు మద్దతు ధర వచ్చే వరకు ప్రతీ దశలోనూ రైతు సమన్వయ సమితులు చురుకైన పాత్ర పోషించేలా వారికి విధులు, బాధ్యతలుంటాయని సిఎం స్పష్టం చేశారు. రైతు సమన్వయ సమితుల్లో కనీసం 51 శాతం మంది బలహీన వర్గాలు, మహిళలు ఉండేలా నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఈ నెల 25, 26 తేదీల్లో సదస్సుల్లో మండల రైతు సమన్వయ సమితి సభ్యులతో పాటు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్ పర్సన్లు హాజరు కావాలని సిఎం చెప్పారు.
SEE ALSO : ఎల్లో గ్యాంగ్ మైండ్ బ్లాక్ అయ్యేలా షేర్లు చేయండి..!
రైతులు పరస్పరం తమ అభిప్రాయాలు పంచుకోవడం కోసం, నిరంతర అవగాహన సదస్సులు నిర్వహించడం కోసం ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2,630 రైతు వేదికలు నిర్మించనున్నట్లు సిఎం తెలిపారు. ఈ రైతు వేదికలను వీలైనంత త్వరగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రైతు వేదికల నిర్వహణ బాధ్యతలను మండల రైతు సమన్వయ సమితులు తీసుకోవాలని కోరారు. రైతు వేదికల నిర్మాణం కోసం అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలని కలెక్టర్లను సిఎం ఆదేశించారు. ప్రభుత్వ భూముల నుంచి గానీ, దాతల నుంచి గానీ, కొనుగోలు ద్వారా గానీ రైతు వేదికల కోసం స్థలం సేకరించాలని చెప్పారు.