ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీకి ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సొసైటీలో జరుగుతున్న ప్లీనరీ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిశీలించారు. వాలంటీర్లకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.ఏప్రిల్ 27వ తేదీన హైదరాబాద్ లోని జలదృశ్యంలో కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అయిందని హోంమంత్రి నాయిని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దశాబ్దాల కల సాకారం చేసిందన్నారు. 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వివరించారు. రైతులకు పెట్టుబడి ఇచ్చే గొప్ప కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఈ ప్లీనరీ బంగారు బాటలు వేయబోతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, కర్నె ప్రభాకర్, ఆగ్రోస్ చైర్మన్ కిషన్ రావు, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.