విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో భక్తుల నీరాజనాల మధ్య దిగ్విజయవంతంగా సాగిపోతుంది. హన్మకొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవీ నవరాత్రులలో కార్యక్రమంలో గత ఆరు రోజులుగా స్వాత్మానందేంద్ర స్వామివారు శ్రీ రాజశ్యామల అమ్మవారికి పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు కూడా స్వామివారు స్వయంగా రాజశ్యామల అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు చేసి, పీఠపూజ కుంకుమపూజ, రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామివారు తీర్థ ప్రసాదాలు అందజేసి అనుగ్రహభాషణం చేశారు. హిందూ జీవన విధానంలో స్త్రీని అమ్మ అంటారని, హైందవ ఇతిహాసాల్లో, పురాణాల్లో, వేదాల్లో, శాస్త్రాల్లో స్త్రీ ప్రకృతికి ప్రతిరూపమని, శక్తి స్వరూపమని, అందుకే నవరాత్రులకు విశేష ప్రాధాన్యం ఉందని స్వామివారు ప్రవచించారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు దంపతులు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్ దంపతులు, ధర్మ ప్రచారయాత్ర కన్వీనర్, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.