ఆదాయాన్ని పెంచాలి… పేదలకు పంచాలనేది టీఆర్ఎస్ ప్రభుత్వ విధానమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సంక్షేమం విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖలకు సంబందించిన 2020–21 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆయా శాఖల ఉన్నతాధికారులతో గురువారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసరా పెన్షన్ల రూపంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల పేదలకు అండగా నిలుస్తున్నారని… సంక్షేమానికి ఎక్కువ కేటాయింపులు చేస్తున్నారని పేర్కొన్నారు.
‘సీఎం కేసీఆర్ మన రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అదే సమయంలో వేగంగా అభివృద్ధి ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన మేరకు సాయం అందడంలేదు. ఉపాధిహామీ పథకం అమలుకు సంబంధించి మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మెటీరియల్ కాంపౌండ్ కింద రూ.250 కోట్ల నిధులు రావాల్సి ఉంది. ఈ విషయంపై ఇప్పటికే పలుసార్లు కోరాం. మరోసారి దీనిపై కేంద్రానికి లేఖ రాయాలి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి దీనిపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఉపాధిహామీ పథకం తాజా ప్రతిపాదనలలో వైకుంటధామాల, ఇంకుడుగుంతలు, గ్రామపంచాయతీలలో సీసీ రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే పల్లె ప్రగతి అమలులో పనితీరు బాగా ఉన్న గ్రామపంచాయతీలకు సీసీ రోడ్ల కోసం రూ.20 లక్షల చొప్పున ప్రత్యేకంగా నిధులు ఇచ్చేలా ప్రణాళిక ఉండాలి. పల్లె ప్రగతి అమలులో ముందున్న గ్రామపంచాయతీల వివరాలను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రూపొందించాలి. అలాగే పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియ. పల్లె ప్రగతి స్ఫూర్తిని ఎప్పటికీ కొనసాగించాలి. రెండో విడత పల్లె ప్రగతి సైతం రాష్ట్ర వ్యాప్తంగా బాగా జరిగింది. అయితే డ్రైనేజీల శుద్ధీకరణ విషయంలో కొంత నిర్లక్ష్యం ఏర్పడింది. ఈ విషయంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. ప్రధాన్మంత్రి గ్రామ్ సడక్ యోజన మూడో దశ మొదటి విడత కింద మన రాష్ట్రానికి 800 కిలో మీటర్ల రోడ్లు మంజూరయ్యాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి దీనికి సంబందించిన పూర్తి ప్రదిపాదనలు అందాయి. మిగిలిన జిల్లాల నుంచి సైతం వీలైనంత త్వరగా పూర్తి స్థాయి ప్రతిపాదనలు వచ్చేలా చూడాలి. ఫిబ్రవరి 10లోపు ప్రతిపాదనలు పంపే ప్రక్రియ మొత్తం పూర్తి కావాలి. దేశానికి ఆదర్శంగా నిలిచిన మిషన్ భగీరథ కార్యక్రమంపై అందరి నుంచి ప్రశంసలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఇటీవల మన రాష్ట్రానికి వచ్చిన ఉన్నతస్థాయి ఇంజనీర్ల బృందం ప్రశంసించింది. మిషన్ భగీరథకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేలా ప్రయత్నాలను కొనసాగించాలి’ అని మంత్రి దయాకర్రావు అధికారులతో అన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీ సత్యనారాయరెడ్డి, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, సీఈలు పాల్గొన్నారు.