సమాజంలోని అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే నిజమైన దేశ అభివృద్ధి జరిగినట్లు అని భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. దేశంలోని దళితుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని ప్రధాని మోదీని ఈ సందర్భంగా రవి డిమాండ్ చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకొని ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి పిడమర్తి రవి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అట్టడుగు వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ పాలన సాగుతుందన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భారత రాజ్యాంగ స్ఫూర్తిని, దళిత, బహుజన ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ నింగికి ఎగరేసారని తెలిపారు.
అదే విధంగా తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరును సీఎం కేసీఆర్ నామకరణం చేసి నిజమైన నివాళులర్పించారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం అయినా గుజరాత్లో దళితులతో పాటు అన్ని వర్గాలలోని పేదలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారని గుర్తు చేశారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేదరికం నెలకొందన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలను ఆదుకుంటూ, పేదరికాన్ని రూపుమాపుతున్నారని రవి స్పష్టం చేశారు. అన్ని వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు పిడమర్తి రవి.