తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదారాబాద్ లో రెండో దశ మెట్రో రైలు పనులకు ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్న నేపథ్యంలో రాజేంద్రనగర్లోని పోలీసు గ్రౌండ్స్లో బహిరంగ సభ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రెండో దశ మెట్రో లైన్ గొప్ప ప్రాజెక్టు అని పేర్కొన్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మెట్రో రైలు లైన్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
ఇప్పటికే 93 కిలోమీటర్ల మేర మొదటి దశలో మెట్రో రైలు సేవలు అందుతున్నాయన్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద రెండో దశ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం రాజేంద్ర నగర్ పోలీస్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారని మంత్రి తలసాని స్పష్టం చేశారు.