ప్రజలు కలిసి మెలసి ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా తొర్రూరు గౌడ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన శ్రీ కంఠమహేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం, జాతర వేడుకల్లో మంత్రి పాల్గొని పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కంఠమహేశ్వర స్వామి కృపతో గౌడ సంఘం సభ్యుల సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధికి రూ.5 లక్షలు ఇచ్చానని గుర్తు చేశారు. మున్సిపాలిటీ నుంచి రోడ్డు, బ్రిడ్జి, ఆలయ అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేయిస్తానని వెల్లడించారు. ఇటీవల ముఖ్యమంత్రి జిల్లాకు పర్యటించిన సందర్భంగా మున్సిపాలిటీకు రూ. 25 కోట్లు ప్రకటించారని తెలిపారు. స్థలం ఉంటే కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని పేర్కొన్నారు.
పర్వతగిరిలో కాకతీయుల కాలం నాటి శివాలయాన్ని పునః ప్రతిష్ట చేస్తున్నామని ఈ కార్యక్రమానికి గ్రామస్థులంతా తరలి రావాలని కోరారు. పాపాలు చేసినోళ్లు సుఖాలు అనుభవించడం తాత్కాలికమేనని వివరించారు. ప్రజలకు చేసే మంచి పని శాశ్వతంగా నిలుస్తుందని ,అదే మీ పిల్లలకు, కుటుంబానికి ఉపయోగపడుతుందని హితవు పలికారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు హాజరయ్యారు