తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కోకాపేట లో నిర్మిస్తున్న యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలను మార్చి 10 వ తేదీన ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మంగళవారం కోకాపేట లోని యాదవ, కురుమ భవనాలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, MLC లు ఎగ్గే మల్లేశం, బండ ప్రకాష్ ముదిరాజ్, TSEWIDC చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, BC సంక్షేమ శాఖ సెక్రెటరీ బుర్రా వెంకటేశం తదితరులతో కలిసి పరిశీలించారు.
అనంతరం కోకాపేట లో చేపట్టవలసిన రోడ్ల నిర్మాణం, వాటర్ లైన్ వంటి పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాదవ, కురుమ భవనాల కు ప్రహారీ గోడ, గేట్లు, ఆర్చి ల నిర్మాణం తదితర పనులకు అదనంగా 2.60 కోట్ల రూపాయలు అవసరం ఉందని అధికారులు తెలపగా, వెంటనే విడుదల చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
పనులు అన్ని ప్రారంభోత్సవం నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఆత్మగౌరవ భవనాలలో యాదవ, కురుమ భవనాలు మొట్టమొదటివి అన్నారు. భవనాల ప్రారంభం అనంతరం లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వివరించారు.