తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ విద్యుత్తురంగ విజయోత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని సబ్ స్టేషన్లు, విద్యుత్తు కార్యాలయాలను అందంగా ముస్తాబు చేశారు.
సబ్స్టేషన్ల వద్ద ప్రజలు, రైతులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు కష్టాలను ఏవిధంగా అధిగమించిందో రైతులకు వివరించనున్నారు. విద్యుత్తు రంగంలో సాధించిన విజయాలను వివరిస్తూ గ్రామాల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఉత్సవాల్లో విద్యుత్తు శాఖ మంత్రి, జెన్కో, ట్రాన్స్కో సీఎండీ, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సింగరేణిలోనూ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో సాధించిన విజయం అసాధారణమైనది. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్తు రంగంలో నమ్మశక్యంకాని విజయాన్ని నమోదు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అలుముకున్న చిమ్మ చీకట్లను స్వరాష్ట్రంలో తరిమేసి వెలుగులు నింపారు. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, ప్రజలకు, పరిశ్రమలకు ఇవ్వని విధంగా 24 గంటల నిరంతరాయ విద్యుత్తును అందిస్తున్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తూ వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు.
ఉచిత విద్యుత్తు కోసం ఏటా రూ.12 వేల కోట్ల నిధులు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. గడిచిన తొమ్మిదేండ్లలో ఉచిత విద్యుత్తు, విద్యుత్తు రంగంలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం రూ.75 వేల కోట్లు ఖర్చు చేసింది. తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదంటే రాష్ట్రంలో విద్యుత్తురంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. నిరంతర విద్యుత్తుతో వ్యవసాయం బాగుపడి రైతులకు భరోసా లభించింది. పరిశ్రమలు నిరంతరంగా నడుస్తూ యువతకు ఉపాధి దొరుకుతున్నది.