ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం దూసుకుపోతోందని, ఈ రంగంలో ఎంతో పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీ హబ్లో ఐటీ శాఖ 9వ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 2013-14లో హైదరాబాద్లో ఐటీ ఉత్పత్తులు రూ. 57,258 కోట్లు ఉంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ఒక లక్ష 2,41,275 వేల కోట్ల ఐటీ ఎగుమతులకు చేరుకున్నామని తెలిపారు. గత సంవత్సరపు1,83,569 కోట్ల ఎగుమతులతో పోలిస్తే 57,706 కోట్ల పెరుగుదలను సాధించామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ సెక్టార్లో 3,23,396 వేల ఉద్యోగాలు ఉంటే.. ఇప్పుడు 9,05,715 ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు.
ఐటీ రంగంలో బెంగళూరుతో పోటీ పడేలా హైదరాబాద్ను నిలబెట్టామని చెప్పారు. కరోనా వచ్చాక ఐటీ రంగంపై అనేక అపోహాలు వచ్చాయి. ఐటీ రంగంలో కేంద్రం నుంచి సహకారం ఏమీ లేదు. మాట సాయం తప్ప కేంద్రం ఎలాంటి అండదండలు అందించలేదు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు కేటాయిచిన ఐటీఐఆర్ను కూడా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అయినప్పటికీ నిలదొక్కుకుని ఐటీ రంగాన్ని అగ్రభాగానా నిలబెట్టామని కేటీఆర్ తెలిపారు.