తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి ఉద్యమ నేటి అధికార పార్టీ అయిన టీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలిచిన వేల్పూరు మండల రైతులు తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారు. బీ(టీ) ఆర్ఎస్కు మద్దతు తెలియజేస్తూ స్వచ్ఛందంగా రూ.లక్షా 50వేల 116ను విరాళం అందజేసి ఆదర్శంగా నిలిచారు..
జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత మండల కేంద్రమైన వేల్పూరు రైతులు.తెలంగాణ రైతుల లెక్కనే దేశం అంతటా రైతులు సంబురంగా ఉండాలంటే కేసీఆర్ ప్రధాని కావాలని కాంక్షించిన రైతులు, మంత్రి వేముల తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి రైతులకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి కి మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు విరాళాలు అందించి మద్దతు పలికారు.కేసీఆర్ వచ్చిన తర్వాతనే తెలంగాణలో రైతు గోసలు పోయాయని పేర్కొన్నారు.
రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్,పుష్కలంగా సాగు నీరు అందించి రైతును రాజుగా చేశాడని కొనియాడారు. పెట్టుబడి సాయం ఇవ్వడమే కాకుండా రైతు పండించిన ధాన్యాన్ని కూడా కొంటున్న ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ లో చెక్ డ్యాంలు నిర్మించి రైతుల సాగునీటి సమస్యలు తీర్చారని పేర్కొన్నారు.బీఆర్ఎస్కు స్వచ్ఛందంగా విరాళాలు అందించి మద్దతు పలికిన వేల్పూర్ మండల రైతులకు రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతులు, పేదలు కష్టాలను పరిష్కరించడమే కేసీఆర్ పాలన ఉంటుందని పునరుద్ఘాటించారు.