కేంద్ర ప్రభుత్వం పలు పథకాల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అసహనం వ్యక్తం చేశారు. పంటల బీమాపై కేంద్రం వైఖరి సరిగా లేదన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ ప్రగతి భవన్ లో జరిగింది. కేంద్రం ఇస్తున్న నిధులతో అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ఆమె సమీక్షించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ పంటల బీమాకుగ్రామాన్ని యూనిట్ గా తీసుకోకుండా రైతును యూనిట్ గా తీసుకుని నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గ్రామాన్ని యూనిట్ గా తీసుకునే కేంద్రం విధానం వల్ల రైతులు నష్టపోతున్నారను చెప్పారు.
ఒక పక్క మహిళా సాధికారత అంటూనే కేజీబీవీలను ఎత్తివేసిందని విమర్శించారు. ఉపాధి హామీ నిధుల్లో కోత పెట్టారని, ఫలితంగా కూలీలు నష్టపోయారన్నారు. కేంద్రం విడుదల చేయాల్సిన నిధులను విడుదల చేయడం లేదని ఎంపీ కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో
జడ్పి చైర్మన్ దఫేదార్ రాజు, మేయర్ ఆకుల సుజాత, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, ఆర్మూర్, బోధన్,నిజామాబాద్ ఆర్భన్ ఎమ్మెల్యేలు ఆశాన్నగారి జీవన్ రెడ్డి, షకీల్ ఆమిర్,బిగాల గణేష్ గుప్తా, జడ్పి వైస్ చైర్మన్ సుమనారెడ్డి, డిసిసిబి చైర్మన్ గంగాధర్ పట్వారీ, రెడ్ కో చైర్మన్ ఎస్.ఏ అలీం, ఇంచార్జ్ కలెక్టర్ రవిందర్ రెడ్డి పాల్గొన్నారు.