రాష్ట్రంలో దళితులు ప్రగతిబాట పట్టారు. మూడున్నరేండ్ల క్రితం వరకూ తమకోసం ఓ ప్రభుత్వమంటూ ఉంటుందన్న విషయమే తెలియని దళిత సమాజం ఇవాళ తమకోసం పనిచేసే ప్రభుత్వం అండతో భరో సాగా అభివృద్ధి పథాన నడుస్తున్నది. దళిత కుటుంబాల్లోని వర్తమాన, భవిష్యత్ తరాలు విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రగతి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిచిన అభివృద్ధి దారిలో లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఏడున్నర దశాబ్దాలుగా ఎన్నికల నినాదాలకే పరిమితమైన దళితుల పురోగతి ఇప్పుడు ఊహించని విధంగా పలు పథకాలతో సాగిపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుచేస్తూ.. దేశవ్యాప్తంగా ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. అనేక రాష్ర్టాల నుంచి, కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి ప్రతినిధులు, బృందాలు తెలంగాణలో క్షేత్రస్థాయిలో పర్యటించి దళితుల అభివృద్ధి కోసం అమలవుతున్న పథకాల తీరును పరిశీలించి ఆశ్చర్యపోతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక గడిచిన మూడేండ్ల స్వల్పకాలంలోనే వివిధ పథకాల ద్వారా 20,55,179 మంది ఎస్సీలకు లబ్ధి చేకూరింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.5938.7 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి పేర రూ.14,375 కోట్లు కేటాయించారు. ఎస్సీల సంక్షేమం కోసం 43 ప్రభుత్వ శాఖల ద్వారా పలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారు. ఎస్సీ స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ పొందిన వారిలో 101 మంది అభ్యర్థులు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగావకాశాలు పొందారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఎస్సీ కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెండ్లికి రూ.75,116 ఇస్తున్నారు.
అధ్యయనానికి పలు రాష్ర్టాల బృందాలు
ఎస్సీ వర్గాల అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలపై అవగాహన కోసం దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల నుంచి వివిధ సంస్థల ప్రతినిధి బృందాలు మన రాష్ర్టానికి వస్తున్నాయి. మంగళవారం పంజాబ్ రాష్ర్టానికి చెందిన సంక్షేమ శాఖ బృందాలు తెలంగాణకు వచ్చాయి. ఇటీవలే జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చెందిన ప్రత్యేక ప్రతినిధి అశోక్సాహూ నాలుగురోజులపాటు రాష్ట్రంలో పర్యటించి, ఎస్సీ సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను ప్రశంసించారు. తెలంగాణ సర్కార్ దూరదృష్టితో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా భవిష్యత్ తరాలు విద్యాప్రగతి సాధిస్తాయని అభినందించారు. ఎస్సీ కుటుంబాలకు చెందిన పలువురు వెట్టి కార్మికులుగా మిగిలిపోకుండా ఉండేందుకు ఈ పథకాలు ఎంతో దోహదపడతాయని కొనియాడారు.
ఎస్సీల కోసం అమలవుతున్న పథకాలు
ఎస్సీలకు ఎన్నడూ లేని విధంగా మూడెకరాల వ్యవసాయ భూమిని అందించడంకోసం, వ్యవసాయ భూమిని రూ.7లక్షలతో కొనుగోలుచేస్తునారు. 104 రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు, 30 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు నిర్వహిస్తున్నారు. పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లకు ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేశారు. హాస్టళ్లకు, రెసిడెన్షియల్ విద్యాలయాలకు రూ.34 కు కిలో చొప్పున సన్నబియ్యం కొనుగోలు చేసి కేవలం రూ.1కి అందిస్తున్నారు. గుడుం బా బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు ఆర్థిక సహాయం, 11 జిల్లాల్లో స్టడీ సర్కిళ్ల ఏర్పాటు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం కింద విదేశాల్లో చదువుకునే దళిత విద్యార్థులకు రూ. 20 లక్షల ఆర్థిక సాయం, హాస్టళ్లలోని విద్యార్థులకు డైట్ చార్జీల పెంపుతోపాటు, కళాశాల స్థాయి విద్యార్థులకు స్కాలర్షిప్ల పెంచారు. 312 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ. 152.30కోట్లు కేటాయించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో జనరల్ కోటాకింద చేసిన ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్ల చెల్లింపులు జరుపుతున్నారు.
బడిమానేసేవారి సంఖ్య తగ్గింది
గతంలో దళిత కుటుంబాల్లోని చిన్నారులు బడిమానేసి వెట్టి కార్మికులుగా మగ్గే పరిస్థితి ఉండేదని, ప్రభుత్వ చర్యల వల్ల బడి మానేసే వారి సంఖ్య తగ్గిందని ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్ పీ కరుణాకర్ తెలిపారు. విద్యపై ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధతో బడికి వెళ్లే వారి సంఖ్య పెరిగిందన్నారు. కాగా వివిధ రాష్ర్టాలకు చెందిన చాలామంది ప్రతినిధులు తమ బృందాలతో తెలంగాణలో ఎస్సీలకోసం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన పొందేందుకు వస్తున్నట్లు ఆయన వెల్లడించారు.