ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్కు దూసుకెళ్లింది. ఏకపక్షంగా జరిగిన సెమీస్లో చైనా షట్లర్ చెన్ యుఫీని 46 నిమిషాల్లోనే చిత్తుచిత్తుగా ఓడించింది. శనివారం జరిగిన ఈ సెమీస్లో 21-19, 21-10 తేడాతో యుఫీని సింధూ మట్టికరిపించి తొలిసారి ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లోకి సగర్వంగా అడుగుపెట్టింది. మ్యాచ్ను చైనా షట్లర్ ధాటిగా ఆరంభించింది. సింధూపై మొదటి గేమ్లో 4-7తో ఆధిక్యంలోకి వెళ్లింది. వెంటనే తేరుకున్న సింధు వెంట వెంటనే పాయింట్లు సాధించి స్కోరును సమం చేసింది. తర్వాత దూకుడును పెంచిన సింధు అటాకింగ్ గేమ్తో మొదటి సెట్ను 21-19తో కైవసం చేసుకుంది. అనంతరం రెండో గేమ్లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వని సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో 21-10తో గేమ్తో పాటు మ్యాచ్ను చేజిక్కించుకుంది. ఇక ఫైనల్లో భాగంగా ఆదివారం జపాన్ స్టార్ క్రీడాకారిణి యమగూచితో సింధూ తలపడనుంది.
