నేడు జాతీయ చేనేత దినోత్సవం (ఆగష్టు 7) సందర్భంగా చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండేలా, వారి కుటుంబాల్లో సంతోషం ఉండేలా వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు సిఎం వెల్లడించారు.బడుగు, బలహీనవార్గాల కుటుంబాలకు అన్ని వేళలా ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని సీఎం కేసిఆర్ అన్నారు.చేనేత కార్మికులకు సంక్షేమంలో భాగంగా నెలకు 2,016 రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పింఛను అందిస్తున్నదని పేర్కొన్నారు.
బతుకమ్మ చీరల ద్వారా నేత కార్మికులకు ఉపాధి కల్పించి నేతన్నల జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని సీఎం తెలిపారు. నేతన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రయోజనం కల్పించామని అన్నారు. నేతన్నకు చేయూత పథకం అమలు చేస్తూ వారి ఆదాయం పెరిగేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు.ప్రభుత్వ పథకాలు చేనేత కార్మికులకు నేరుగా చేరేలా మగ్గాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు.
చేనేత మిత్ర ద్వారా నూలు, సిల్క్, ఉన్ని, డై, రసాయనాల కొనుగోలుపై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని 20 శాతం నుంచి 40 శాతానికి పెంచిందని తెలిపారు.ప్రభుత్వం రూ.28.96 కోట్ల చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేసిందని, పావలా వడ్డీ ద్వారా రూ.120 కోట్ల రుణాలను 523 సొసైటీలకు అందించడం జరిగిందని అన్నారు.చేనేత పాలసీ (T-TAP), చేనేత దారులకు పవర్ లూమ్ మగ్గాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి చీరలు నేయించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని చెప్పారు.చేనేత కార్మికుల అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి తో చేస్తున్న కృషి ఫలితాలను అందిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు