తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ను ఎలాంటి రాజకీయపు వ్యాఖ్యలు చేయద్దని చెప్పినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పై ఆయన క్లారిటీచ్చారు.. కొత్తగూడెం పర్యటనలో ఉన్న పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస రావు కొట్టిపారేశారు. తనకు ఫోన్ చేసి మంత్రి క్లాస్ తీసుకున్నారనేది పూర్తిగా అవాస్తవమని చెప్పారు.
డాక్టర్ జీఎస్ఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం కొత్తగూడెంలోనే ఉన్నానని తెలిపారు. అక్కడి ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు గడప గడపకు గడల కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ఈ క్రమంలో గిట్టని వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని విమర్శించారు.
ప్రజలు, మీడియా మిత్రులు ఆ ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరెన్ని అడ్డుపుల్లలు వేసినా కొత్తగూడెంలో డా.జీఎస్ఆర్ ట్రస్ట్ సేవలు నిరాటంకంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ గారి స్పూర్తితో ముందుకెళ్తామని చెప్పారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.