తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా అధికారక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు .ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కు మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ ను కోరారు. గనుల కేటాయింపుపై కేంద్రమంత్రి అధ్యక్షతన ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ లో సమావేశం జరిగింది.
సమావేశంలో మంత్రి కేటీఆర్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఏపీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ పాల్గొన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి గతంలో కేంద్రం వ్యక్తం చేసిన పలు అభ్యంతరాలపై సవివరణమైన పత్రాలను కేంద్రానికి మంత్రి కేటీఆర్ అందజేశారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ను నెల రోజుల్లోనే సమావేశపరిచి తుది నివేదిక ఇచ్చేలా చూస్తామని కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ హామీ ఇచ్చారు.
