భాగ్యనగర ప్రజలకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఎల్బీనగర్ – మియాపూర్, నాగోల్ – మియాపూర్ రూట్లలో ప్రతి రోజూ లక్షల సంఖ్యలో నగర ప్రజలను గమ్యస్థానాలకు చేరుస్తున్న హైదరాబాద్ మెట్రో తాజాగా మరో కారిడార్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కారిడార్ – 2 లో భాగంగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 10 కి.మీ. మేర మార్గాన్ని ప్రారంభించేందుకు హెచ్ఎంఆర్ఎల్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మెట్రో స్టేషన్లలో టికెట్ మిషన్లు, అక్సిలరీ పవర్ సర్వీస్ స్టేషన్లు, విద్యుత్ లైన్, ట్రాక్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే విద్యుత్ తనిఖీలు కూడా పూర్తి చేశారని సమాచారం. అధికారులు ట్రయల్ రన్ పూర్తి చేయడమే ఆలస్యం జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైళ్ల సేవలు ప్రారంభమవుతాయి. నవంబర్ నెలలో ఈ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. జూబ్లీ బస్ స్టేషన్ నుండి పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వరకు మెట్రో సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నాగోల్ – మియాపూర్, ఎల్బీనగర్ – మియాపూర్ మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఒక్క రోజే 5 లక్షల మంది ప్రయాణం చేయడంతో హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మొత్తంగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో రైల్ ఆక్యుపెన్సీలో దూసుకుపోతుంది. ఇప్పుడు జేబీఎస్ – ఎంజీబీఎస్ మార్గం కూడా అందుబాటులో వస్తే మెట్రోకు మరింత ఆదరణ పెరగడం ఖాయం.
