తెలంగాణ రాష్ట్రంలోని కుల వృత్తుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మత్స్యకారుల సంక్షేమానికి రూ. 500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధికి చేయూతనిస్తున్నామని స్పష్టం చేశారు. రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్లో 9 లక్షల 12 వేల చేపపిల్లలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ కలిసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గోపితో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పనతో పాటు స్వయం ఉపాధి అవకాశాల కల్పనకూ పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం నీళ్లు, 24 గంటల కరెంట్తో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్వన్గా నిలుస్తుందని పేర్కొన్నారు.
