తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన అనుచరులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..నమ్మిన పార్టీని, నమ్ముకున్న ప్రజలను అమ్ముకోవడం కోమటిరెడ్డి బ్రదర్స్కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోను వీరు మోసాలకు పాల్పడ్డారన్నారు.
కడపకు నీటిని తరలిస్తుంటే వైఎస్కు వంత పాడారని గుర్తు చేశారు. రాజీనామా చేస్తే ఉప ఎన్నికలే వస్తాయి. అభివృద్ధి కోసమైతే మీ సహచరులు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని విమర్శించారు.