కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో ఎన్నో ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న తీవ్ర ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పలు మార్లు అసెంబ్లీ వేదికగా.. గౌరవ పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లగా.. అందుకు మంత్రి శ్రీ కేటీఆర్ గారు స్పందించారు.
ప్రత్యేక జీఓ నెంబర్ 892 ద్వారా రూ.56 కోట్ల నిధులు మంజూరు చేశారు. మెదక్ రోడ్డు నుండి నేషనల్ హైవేకు అనుసంధానం చేస్తూ సుమారు 3.8 కిలోమీటర్ల మేర ఉన్న ఈ ప్రధాన లింకు రోడ్డులో వాహనదారులతో పాటు పరిశ్రమలు ఉన్నందున భారీ వాహనాలు కూడా ప్రయాణించడంతో సింగిల్ లైన్ వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ప్రజల ఇబ్బందులు స్వయంగా గుర్తించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు శాశ్వత పరిష్కారం కోసం బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, అందుకు అవసరమయ్యే నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ గారిని అభ్యర్థించారు.
దీని దృష్ట్యా సమస్య శాశ్వత పరిష్కారానికి భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మాస్టర్ ప్లాన్ లో భాగంగా ప్రస్తుతం 60 ఫీట్లు ఉన్న రోడ్డులో 80 ఫీట్లు వెడల్పుగా నాలుగు వరుసలతో స్టీల్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఫేస్-2 కింద టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా తన అభ్యర్థన మేరకు స్పందించి రూ.56 కోట్లు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే గారు ప్రజల తరపున గౌరవ మంత్రి కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.