ప్రతి భారత పౌరుడికీ విజయం లభిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. రాజస్థాన్లోని చురులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ వేకువ జామున నియంత్రణ రేఖ దాటి పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం మెరుపు దాడిని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. మెరుపుదాడి వీరులకు తలవంచి నమస్కారం చేద్దామన్నారు. ‘‘ఈ దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని అందిస్తున్నా. దేశానికి, జాతికి ఎన్నటికీ తలవంపులు తీసుకురాను. సగర్వ భారతావని తల ఎత్తుకునే ఉంటుంది. ఈ దేశ గౌరవ మర్యాదలను మంటగలిపే పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. భారతమాతపై శపథం చేస్తున్నా.. మీ తల వంచుకోనివ్వను. జాతి ప్రయాణం ఆగదు.. ఈ జాతి విజయయాత్ర కొనసాగుతూనే ఉంటుంది. జాతి నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ప్రధాన సేవకుడిలా నమస్కరిస్తున్నా. వ్యక్తి కంటే పార్టీ.. పార్టీ కంటే దేశం గొప్పదనే భావనతో పనిచేస్తున్నాం. దేశ రక్షణలో అమరులైన సైనికుల జ్ఞాపకార్థం నిన్న యుద్ధ స్మారకం ప్రారంభించాం. ఓఆర్ఓపీ కింద మాజీ సైనికులకు రూ.35వేల కోట్లు అందించాం’’ అని మోదీ అన్నారు.