తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావుపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. దళితుల పట్ల ఆయన వైఖరిని నిరసిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆ.ర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది.అయితే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు శాసనసభ నుంచి వెళ్లినందుకు నిరసనగా.. దుబ్బాకలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దళిత సంఘాల ఆధ్వర్యంలో దహనం చేశారు.
బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే తన తీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.