Marri Sasidhar Reddy : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఇటీవల పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ఆయనను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కొద్దిరోజులకే శశిధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్తో కాంగ్రెస్ నాయకులు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు అయినప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ అన్ని ఎన్నికలు ఓడిపోతూ వచ్చిందన్నారు. పీసీసీ అధ్యక్షుడి పదవి కావాలంటే దాదాపు రూ. 25 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. పార్టీ తెలంగాణ వ్యవహరాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ పై కూడా శశిధర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. చాలా బాధతో తాను ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వాపోయారు.
కాగా సోనియా గాంధీ పట్ల శశిధర్ రెడ్డి సానుకూలత వ్యక్తం చేసినప్పటికి… మిగిలిన నాయకులపై ఫైర్ అయ్యారు. పార్టీలో ప్రస్తుత పరిస్థితులను గతంలో ఎప్పుడూ చూడలేదని… పార్టీలో పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కోసం పని చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పారు. పార్టీ ఇన్ ఛార్జిలు పీసీసీ అధ్యక్షులకు దాసోహం అయిపోతున్నారని, హైకమాండ్కు ప్రతినిధులుగా వ్యవహరించాల్సింది పోయి పీసీసీ చీఫ్ చెప్పినట్లు నడుచుకుంటున్నారన్నారు.