నేడు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. ‘ఉగ్రవాద నిర్మూలనే ప్రధాన అంశంగా బ్రిక్స్ సదస్సు’ అనే ఇతివృత్తంతో జరగనున్న ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ఆయా దేశాల అగ్రనేతలు పాల్గొననున్నారు. బ్రిక్స్ దేశాలు డిజిటల్ ఎకానమీ, శాస్త్ర, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించనున్నాయని మంగళవారం బ్రెజిల్కు బయల్దేరి వెళ్లేముందు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాద నిర్మూలన విషయంలో పరస్పర సహకారానికి యంత్రాంగాలను కూడా రూపొందించుకుంటాయని ఆయన స్పష్టం చేశారు. నేటి నుంచి 15వ తేది వరకు ఈ సమావేశం జరగనుంది.
బ్రెజిల్ – భారత్ ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా అధ్యక్షుడు జైర్ బోల్సోనారోతో సమావేశం కానున్నట్లు మోదీ తెలిపారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, వ్యవసాయం, ఇంధనం, అంతరిక్ష రంగాల్లో పరస్పర సహకారం పెంపునకు కృషి చేస్తామని చెప్పారు.మోదీ… రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్తోనూ వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ ముగింపు వేడుక, బ్రిక్స్ ప్లీనరీ సెషన్లకూ హాజరుకానున్నారు.బ్రిక్స్ సమావేశంలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణ ఆఫ్రికా సభ్యదేశాలు. ఈ ఐదు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మొత్తం జనాభా.. ప్రపంచ జనాభాలో 42 శాతం. ప్రపంచ స్థూల జాతీయ ఉత్పత్తిలో బ్రిక్స్ వాటా 23 శాతం. బ్రిక్స్ సదస్సులో మోదీ పాల్గొనడం ఇది ఆరోసారి. మోదీ మొదటిసారిగా 2014లో బ్రెజిల్ ఫోర్టాలెజాలో జరిగిన సదస్సుకు హాజరయ్యారు.