వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసును స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. శ్రీశ్రీ రవిశంకర్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కల్లీఫుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచులతో కూడిన ముగ్గురు మధ్యవర్తుల బృందాన్ని ప్రకటించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ ఫైజాబాద్లో కొనసాగాలనీ… చర్చలన్నీ సీసీ కెమేరా పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా కొనసాగాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన సమాచారం మీడియా సహా మరెవ్వరికీ తెలుపరాదని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. నాలుగు వారాల్లోగా మధ్యవర్తిత్వ ప్రక్రియ పూర్తిచేసి నివేదిక సమర్పించాలని గడువు విధించింది.
జస్టిస్ కల్లీఫుల్లా నేతృత్వం వహించనున్న మధ్యవర్తుల బృందం వచ్చేవారంలోనే పని ప్రారంభించనున్నట్టు సమాచారం. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం కేసుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని ముగ్గురు కక్షిదారులైన సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రాంలల్లా సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 14 పిటిషన్లు దాఖలయ్యాయి