Cm Ys Jagan : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కలియుగ రావణుడు అని ఏపీ సీఎం జగన్ అన్నారు. రాజకీయమంటే ఒక జవాబుదారీతనమని, మోసం చేసే చంద్రబాబుకి ప్రజలు గుడ్ బై చెప్పాలని కోరారు. ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… ప్రజలు మోసగాళ్ల మాటలను నమ్మద్దని కోరారు. సొంతంగా పార్టీ పెట్టుకుని ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అధికారం లోకి వచ్చారని చెప్పారు. అయితే తెలుగు దేశం పార్టీని కబ్జా చేసిన చంద్రబాబుని ఓ కబ్జాదారుడు అంటారని విమర్శించారు.
సొంత పార్టీ స్థాపించి అధికారంలోకి వస్తే రాముడు అంటారని, మామ పార్టీని లాగి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుని రావణుడు అంటారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. అలాంటి చంద్రబాబుకు 2024 లో ‘బాయ్ బాయ్’ చెప్పాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై జరిగే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, ప్రజలకు మంచి జరిగిందని భావిస్తే తనకు మద్దతివ్వాలని జగన్ అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వే చేపడుతున్నాం. 17 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో భూములు సర్వే చేస్తున్నాం అని తెలిపారు.
రెండేళ్ల కొంద గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించాం. తొలి దశలో రెండు వేల రెవెన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగింది. 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలు అందించాం. ఫిబ్రవరిలో రెండో దశలో 4వేల గ్రామాల్లో సర్వే. మే 2023 కల్లా 6వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు ఇస్తాం. ఆగస్ట్, 2023 కల్లా 9వేల గ్రామాల్లో సర్వే పూర్తి అవుతుంది’’ అని సీఎం జగన్ తెలిపారు. నరసాపురం లో రెండు లిఫ్ట్ ఇరిగేషన్, రోడ్డు విస్తరణకు మంత్రి ధర్మాన కోరిక మేరకు సీఎం జగన్ పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేస్తునట్టు ప్రకటించారు. ఉద్దానం కిడ్నీ రోగులకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆసుపత్రి నిర్మిస్తున్నామని వెల్లడించారు. వంశధార ప్రాజెక్టు అడ్డంకులు అధిగమిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఒడిశా సీఎంతో మాట్లాడినట్లు తెలిపారు.