దేశీయ వ్యాపార దిగ్గజాల్లో మరో సంచలనాత్మక విరాళం ప్రకటించారు ప్రఖ్యాత మొబైల్ సేవల కంపెనీ అధినేత సునీల్ భారతీ మిట్టల్. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, అతని భార్య రోహిణీ నీలేకనిలు తమ సంపదలోని సగ భాగాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించి కార్పొరేట్ వర్గాల దాతృత్వం వైపు అందరిచూపును తిప్పుకొనేలా చేసిన తీరుకు కొనసాగింపుగా…మిట్టల్ ఏకంగా ఏడువేల కోట్ల విరాళం ప్రకటించారు. మిట్టల్ గ్రూప్నకు చెందిన దాతృత్వ సంస్థ భారతి ఫౌండేషన్కు తమ సంపదలో పదిశాతం వాటాను విరాళానికి కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఈ విరాళం మొత్తం రూ.7000 కోట్లు.
ఈ విరాళం సందర్భంగా భారతీ ఫౌండేషన్ ద్వారా కొనసాగనున్న పలు కార్యక్రమాల వివరాలను మిట్టల్ వెల్లడించారు. విద్యారంగంలో మార్పులు తీసకువచ్చేందుకు తాము ప్రత్యేకంగా యూనివర్సిటీని నెలకొల్పనున్నట్లు తెలిపారు. సత్య భారతి యూనివర్సిటీ పేరుతో ఏర్పాటు చేయనున్న ఈ యూనివిర్సిటీ ద్వారా వెనకబడిన వర్గాలకు చెందిన నిరుపేద యువతకు ఉచిత విద్య అందించనున్నట్లు మిట్టల్ తెలిపారు. ఉత్తర భారతదేశంలో ప్రారంభం కానున్న ఈ యూనివర్సిటీ నిర్మాణానికి అవసరమయ్యే భూమి కోసం చర్చలు జరుపుతున్నట్టు ఆయన వివరించారు.
కాగా, ఈ యూనివర్సిటీ ద్వారా తొలి విడతలో పదివేల మంది విద్యార్థులకు విద్యాభ్యాసం సౌలభ్యం అవకాశం దక్కుతుందని మిట్టల్ తెలిపారు. ఐటీ రంగంలోని రాబోయే కాలం ఉపాధి అవకాశాలైన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ పరిజ్ఞానాన్ని నేర్పించనున్నట్టు మిట్టల్ వివరించారు. 2021 నుంచి సత్యభారతి యూనివర్సిటీ కార్యకపాలు ప్రారంభించనుంది.
Post Views: 316