ప్రపంచంలో అరుదైన ఎత్తిపోతల సాగునీటి పథకాలు ఉన్నప్పటికీ హంద్రీ-నీవా పథకానికి ఉన్న ప్రత్యేకతలు వేరు. ప్రపంచంలో ఏ సాగునీటి ఎత్తిపోతల పథకానికి లేనన్ని పంప్హౌస్లు, మోటార్లు ఈ ఎత్తిపోతల పథకంలో ఉన్నాయి. ఇది అరుదైన సాంకేతిక అంశం. ఈ పథకంలో 1,2 దశల్లో మొత్తం 43 పంప్హౌస్ను నిర్మించి వాటిలో 269 యూనిట్లను (మోటార్, పంప్ కలిపి ఒక యూనిట్) ఏర్పాటు చేయడం ద్వారా ఎంఈఐఎల్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఆసియాలో అతిపెద్దది, పొడవైన ఎత్తిపోతల పథకం ఇదే. అయితే కాళేశ్వరం, దేవాదుల, కల్వకుర్తి, పామూరు-రంగారెడ్డి లాంటి పథకాలు బాగా పెద్దవైనప్పటికీ వాటి నిర్మాణం ఇప్పటికీ పూర్తి కానందున ప్రస్తుతానికి ఆసియాలో అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా హంద్రీ-నీవా గుర్తింపు పొందింది. ప్రపంచంలో పరిశీలిస్తే అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన, ఎత్తైన ప్రాంతానికి నీటిని పంపింగ్ చేసే తాగు, సాగు నీటి పథకాలు దాదాపు 80 ఏళ్ళ క్రితమే చేపట్టారు. అయితే వీటన్నింటినీ కాళేశ్వరం రికార్డ్ బద్దలు కొట్టనుంది. కానీ ఇప్పటివరకు పూర్తైన ఎత్తిపోతల పథకాల్లో హంద్రీ-నీవా ప్రాజెక్ట్లో మోటార్లు, పంపుల సంఖ్యా పరంగానూ, పంప్హౌస్ల నిర్మాణ పరంగానూ, ప్రాజెక్ట్ పొడవు విషయంలోనూ ప్రత్యేకతను సంతరించుకోవడంలో ఎంఈఐఎల్ చేపట్టిన ఎలక్ట్రోమెకానికల్ పనులు కీలకమైనవి. రాయలసీమలో నాలుగు జిల్లాకు తాగు, సాగునీరు అందించేందుకు మూడు దశాబ్దాల క్రితం ప్రతిపాదించిందే హంద్రీ-నీవా. హంద్రీ నది కర్నూల్ జిల్లాలోను, నీవా నది చిత్తూరు జిల్లాలోను ఉన్నాయి. ఈ రెండు నదులను కలుపుతూ ప్రధాన కాలువను ఎత్తైన కొండలు, గుట్టల మధ్య తవ్వుతూ నీటిని కర్నూల్ జిల్లా మాల్యాల సమీపంలో కృష్ణానది నుంచి పంపింగ్ చేసే విధంగా నిర్మించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో ఈ పథకాన్ని చేపట్టినప్పుడు అమలు చేయడానికి నిధులు ఎక్కడివి, నీళ్లు ఎక్కవడి అనే ప్రశ్నలు తలెత్తాయి. పంపులు, మోటార్ల నిర్వాహణ సాధ్యమవుతుందా? అని ప్రశ్నించినవారు ఉన్నారు. చిన్నపాటి ఎత్తిపోతల పథకాలను ఐడిసీ, ఆర్ఐసీ లాంటి సంస్థలే నిర్వహించలేక మూతపడుతుంటే భారీ స్థాయిలో పంపుహౌస్లను నిర్వహించడం సాధ్యమవుతుందా? అనే ప్రశ్నలను లేవదీశారు.
వీటన్నింటికీ హంద్రీ-నీవా మొదటి దశను ఎంఈఐఎల్ పూర్తి చేసి 8 ఏళ్ళ నుంచి నిర్వహిస్తూ ఎటువంటి సమస్యలు, అవరోధాలు ఎదురుకాకుండా నీటిని పంపింగ్ చేయడం ద్వారా సంస్థ తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడంతో పాటు ఎత్తిపోతల పథకాలు విజయవంతం అవుతాయని అది అమెరికాలోని కొలరాడో అయినా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ అయినా అని నిరూపణ అయ్యింది. ఈ పథకం క్రింద మొదటిదశలో 12 పంప్హౌల్ క్రింద 129 యూనిట్లు (మోటార్లు, పంప్లు) గత ఎనిమిదేళ్ళుగా సమర్థంగా పనిచేస్తున్నాయి.
రెండో దశ క్రింద అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలోని మడకశిర, పుంగనూరు బ్రాంచ్ కాలువ ద్వారా దాదాపు 565 కిలోమీటర్ల ప్రధాన కాలువలో నీటిని పంప్చేయడం ఈ సీజన్లో ప్రారంభించారు. 31 పంపింగ్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన 140 యూనిట్లు పంపింగ్కు సిద్ధమయ్యాయి. ఇందులో 43 యూనిట్లతో ఈ సీజన్లో నీటి పంపింగ్ను ప్రారంభించారు. ఇప్పటికీ 160 టీఎంసీల నీటిని కర్నూలు జిల్లా మాల్యాల నుంచి చివరి వరకు (చిత్తూరు జిల్లా) మొత్తం 43 పంప్హౌస్ ద్వారా నీటిని తోడడం ద్వారా ప్రపంచంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. ఇంతవరకు అమెరికా, చైనా తదితర దేశాల్లో ఎక్కడా కూడా ఒక ఎత్తిపోతల పథకం కింద ఇన్ని పంప్హౌస్లు లేనేలేవు. అతిపెద్దదిగా పరిగణించే కాలిఫోర్నియా స్టేట్ వాటర్ ప్రాజెక్ట్, కొలరాడో థాంసంగ్ ప్రాజెక్ట్లో కూడా 6 నుంచి 11లోపు పంపింగ్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. అక్కడి ప్రాజెక్ట్ల్లో మోటార్లు, పంప్లు కేవలం హార్స్పవర్ల సామర్థ్యంతో మాత్రమే ఏర్పాటయ్యాయి. కానీ హంద్రీ-నీవాలో మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. అంటే యూనిట్ల సామర్థ్యం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ భారీ సామర్థ్యంతో ఏర్పాటయ్యాయి. ఇక దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఎత్తిపోతల పథకాలు నిర్మాణంలో ఉండగా ఇప్పటివరకు పూర్తైన వాటిలో
ఎక్కడా కూడా అన్ని పంపింగ్ స్టేషన్లు లేనేలేవు. నిర్మాణంలో ఉన్న దేవాదులలో 20, కల్వకుర్తి 15, రాజీవ్భీమాలో 12, సీతారామలో 19, గండికోటలో 14 చొప్పున ఉన్నాయి. కాళేశ్వరం పూర్తయితే మొత్తం 82 పంప్లు వినియోగంలోకి వస్తాయి.
ఈ విధంగా దేశంలోనే కాకుండా ప్రపంచంలో మొత్తం మీదనే అత్యధిక పంప్హౌస్లు, వాటిలో భారీ సంఖ్యలో యూనిట్లు నిర్మించిన ఘనత ఎంఈఐఎల్కు హంద్రీ-నీవా ప్రాజెక్ట్లో దక్కింది. మొదటిదశను 2012లో అత్యంత క్లిష్టమైన 12 పంప్హౌస్ల నిర్మాణం పూర్తిచేసి సరాసరిన 200 మీటర్ల ఎత్తుకు నీటి పంపింగ్ను అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. రెండోదశలో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలో తాగు, సాగునీరు అందించే విధంగా ఈ ఏడాది పంపింగ్ పథకాలను ప్రారంభించారు. మొత్తం ఈ ప్రాజెక్ట్ కింద 40 టీఎంసీల నీటిని పంప్చేసి 6.25 లక్షల ఎకరాలకు
సాగునీటితో పాటు 81 మండలాల్లోని 437 గ్రామాల్లో 35 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే విధంగా 2006లో నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని చేపట్టారు.
హెచ్ఎన్ఎస్ఎస్ రెండో దశలో అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని 4,04,500 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎంఈఐఎల్ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి మడకశిర బ్రాంచ్ కెనాల్కు నీరు అందేలా నిర్మాణాలు పూర్తి చేసింది. ఈ కాలువ ద్వారా పెనుకొండ, హిందూపూర్, మడకశిర అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 74,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 19 పంప్ హౌజ్లను నిర్మాణం చేసింది. జీడిపల్లి పంప్ హౌజ్ ద్వారా మడకశిర బ్రాంచ్ కెనాల్ పై 155.2 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న 18 పంప్ హౌజ్లకు నీటిని పంపింగ్ చేస్తారు. మడకశిర బ్రాండ్ కెనాల్పై ఎల్-1 నుంచి ఎల్-17, ఎల్-4 పంప్ హౌజ్లో మొత్తం 81 పంపులను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. జీడిపల్లి పంప్ హౌజ్ వద్ద 132/6.6 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, మిగిలిని పంప్హౌస్ల వద్ద 33/6.6 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ను ఎంఈఐఎల్ నిర్మించింది.