పిరికి పంద చర్యలతో పుల్వామాలో భారతీయ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత సైన్యం. కీలక సూత్రధారి జైషే మహ్మద్ కమాండర్ రషీద్ ఘాజీతో పాటు ఉగ్రవాది కమ్రాన్ను హతమార్చాయి భారత దళాలు. పింగ్లాన్ వద్ద జరుగుతున్న ఎదురుకాల్పుల ప్రదేశంలో వీరు ఆర్మీకి చేతికి చిక్కడంతో వారిని హతమార్చారు. 40మంది జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకోవడానికి పథకం రచించింది అబ్దుల్ రషీద్ ఘాజీ అని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడిన అదిల్ దార్కు శిక్షణ ఇచ్చింది కూడా ఘాజీనే. రషీద్ జైషే మహమ్మద్ సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజర్కు ప్రధాన అనుచరుడు. అదిల్ దార్కు ఈ విషయంలో శిక్షణ ఇచ్చింది కూడా అతడే. ఇతడిని కశ్మీర్కు మసూద్ అజరే పంపడంతో 2017,2018 సంవత్సరాల్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన దాడుల్లో అజర్ మేనల్లుళ్లను మన జవాన్లు మట్టుబెట్టారు.
ఈ ఘటనకు ప్రతీకారంగా ఘాజీని అజర్ కశ్మీర్కు పంపాడు. ఈ దాడులు కూడా పుల్వామాలోనే జరిగాయి. అంతకుముందు ఉగ్రదాడితో ఆందోళనకరంగా మారిన దక్షిణ కాశ్మీర్లో ఆందోళన కొనసాగింది. 43 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే మహ్మద్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని పింగ్లాన్ ప్రాంతంలో భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో వారిని మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ ఘటనలో మేజర్ సహా ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. వీరంతా 55 రాష్ట్రీయ రైఫిల్స్ దళానికి చెందిన వారుగా తెలుస్తోంది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగినట్టు సమాచారం. నలుగురు జవాన్లను వీరమరణానికి కారణమైన వారిపై వెంటనే భద్రతా దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. ఘాజీ మన జవాన్ల చేతుల్లో ఎన్నోసార్లు తప్పించుకున్నాడు. గురువారం ఆత్మాహుతి జరగడానికి కొద్ది రోజుల కిందట ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
పుల్వామాలోని రత్నిపురాలో జరిగిన ఈ ఘటనలో ఒక పౌరుడు, హెచ్వీ బల్జీత్ అనే జవాను మృతి చెందారు. ఆ రోజు జరిగిన ఎదురు కాల్పుల నుంచి ఘాజీ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆత్మాహుతి దాడి పథకం రచించారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. దాడి తరువాత సమీంలోని ఇళ్లలోనే కొన్ని రోజులుగా దాక్కొని ఉన్నాడు. ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం కూడా సీఆర్పీఎఫ్పై దాడి జరిగిన లెతోపొరాకు చాలా దగ్గర్లో ఉంది. ఘాజీ దక్షిణ కాశ్మీర్ గురించి పూర్తిగా తెలుసుకుని అక్కడ పట్టు సంపాదించాడు. అదిల్ దార్ కూడా అలా రిక్రూట్మెంట్ ద్వారా జైషే సంస్థలో చేరిన వాడే. ఘాజీ ద్వారా దక్షిణ కశ్మీర్లో జైషే సంస్థ పట్టు సాధించింది.
గ్రామీణ స్థాయి నుంచే రిక్రూట్మెంట్ చేపట్టడం ద్వారా ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో క్షుణ్ణంగా తెలుసుకునే విధంగా ప్రణాళికలు రచించింది. స్థానిక నియామకాలు చేపట్టేటప్పుడు సదరు యువకులకు, ఆసక్తి చూపేవారికి పెద్ద మొత్తంలో ముట్టజెప్పడం, వారిని బెదిరించడం వంటి చర్యలకు ఘాజీ పాల్పడే వాడు. దీన్ని పసిగట్టిన భద్రతా దళాలు ఈ దుశ్చర్యను ఎన్నో సార్లు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల కిందట ఎదురు కాల్పులు జరిగాయి. ఆ దాడి నుంచి తప్పించుకుని 40 మంది జవాన్ల ప్రాణాలు కోల్పోవడానికి కారకుడయ్యాడు. ఎట్టకేలకు భారత సైన్యం ఘాజీని మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకుంది.