రైళ్లలో వివిధ వర్గాలకు ఇచ్చే రాయితీలను తాత్కాలికంగా నిలిపివేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అనవసరమైన ప్రయాణాలను కట్టడి చేయడానికి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తాము మళ్లీ ప్రకటించే వరకు రాయితీలు ఉండబోవని స్పష్టంచేసింది. 53రకాల రాయితీల్లో మొత్తంగా 15 రకాలను మాత్రం ఇప్పుడు వాడుకునే వీలుంటుందని స్పష్టం చేసింది. 20వ తేదీ లోపు టికెట్లు తీసుకున్నవారు వాటిని రద్దు చేసుకుంటే టికెట్ రద్దు రుసుమును వసూలు చేయరని, రాయితీతో ముందే తీసుకున్న టికెట్పై ప్రయాణం చేస్తే మిగిలిన ఛార్జీని వసూలు చేయరని, విద్యార్థులు, దివ్యాంగుల్లో కలిపి నాలుగు విభాగాల వారికి, మరో 11 రకాల రోగులకు మాత్రం రాయితీలు కొనసాగుతాయని రైల్వేశాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. స్టేషన్లలోనూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రయాణీకులు దూరం దూరంగా ఉండాలని, వ్యక్తిగత శుభ్రతతో పాటుగా, తుమ్మినపుడు, దగ్గినపుడు వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
