Harish Rao : తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 2 వేల దవాఖానాలు ప్రారంభించనున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. వైద్య సేవల్లో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఆరోగ్య తెలంగాణ ధ్యేయంగా పనిచేస్తున్నాం.. ప్రజలకు ప్రభుత్వపరంగా నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం’ అని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్లో ఏఎన్ఎంలతో నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాల తరహాలో ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా రూరల్ ప్రాంతాల్లో దవాఖానాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని తెలిపారు.
త్వరలో అన్ని జిల్లాల్లో మరిన్ని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని, దీని వల్ల ప్రజలకు త్వరతగతిన వైద్య సేవలు అందుతాయని చెప్పారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన 350 బస్తీ దవాఖానాల ఏర్పాటు వల్ల గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గిందని హరీష్ వెల్లడించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 150కి పైగా బస్తీ దవాఖానాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించారు. వివిధ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న ఏఎన్ఎంల ఖాళీలను రెండు నెలల్లో భర్తీ చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన టీ డయాగ్నస్టిక్ సెంటర్లలో 56 టార్గెటెడ్ ఇమేజింగ్ పర్ ఫెటలర్ అనోమాలిస్ యంత్రాలను రెండు రోజుల్లో సమకూర్చుతామని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నాటికి అన్ని జిల్లాల్లో టీ డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు. 2014లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు 30 శాతం నుంచి 67 శాతానికి పెరిగాయని హరీష్ తెలిపారు.
మేడ్చల్ జిల్లాలో 78, ఇతర జిల్లాల్లో 82 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 100 శాతం ప్రసవాలు జరిగేలా చూడాలని ఏఎన్ఎంలను హరీష్ ఆదేశించారు. పుట్టిన బిడ్డకు మొదటి గంటలోనే తల్లి పాలు అందేలా చూడాలని ఏఎన్ఎంలకు సూచించారు. సి-సెక్షన్ డెలివరీలు తగ్గేంచాలని ఏఎన్ఎంలకు హరీష్ రావు సూచించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 5 ప్రభుత్వ మెడికిల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని ఇప్పుడు వాటిని 17కి పెంచామని హర్షం వ్యక్తం చేశారు.