ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరానికి సుప్రీం కోర్డులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ రోజు చిదంబరం పెట్టుకున్న బెయిల్ పిటీషన్ విచారణ తిరస్కరించిన సుప్రీం కోర్డు ఈ కేసులో ఢిల్లీ హైకోర్ట్ ఉత్తర్వులలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే బెయిల్ కోసం చిదంబరం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్ట్ చెప్పింది. మరోవైపు సీబీఐ రిమాండ్ను సవాల్ చేస్తూ చిదంబరం న్యాయవాదులు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయనందున దీనిపై తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి పేర్కొన్నారు. ఈ కేసులో చిదంబరంను అయిదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి తరలించగా నేటితో గడువు ముగిసింది. చిదంబరంను అరెస్ట్ చేయడం ద్వారా ఆయనకు సంక్రమించిన హక్కులను సీబీఐ కాలరాసిందని చిదంబరం తరపున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ పేర్కొన్నారు. కోర్టు పరిధిలో విచారణ సాగుతున్న క్రమంలో సీబీఐ అత్యుత్సాహంతో ఆయనను అరెస్ట్ చేసిందంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సుప్రీం కోర్డ్ మాత్రం ఈ కేసులో ఢిల్లీ హైకోర్ట్ ఉత్తర్వులలో జోక్యం చేసుకోలేమంటూ బెయిల్ పిటీషన్ను తిరస్కరించడంతో చిదంబరం మరింత కాలం రిమాండ్లో ఉండాల్సి వస్తోంది. మొత్తంగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం జైలుకు పోవడం ఖాయమనే చర్చ నేషనల్ మీడియాలో జరుగుతోంది.