కుట్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలకు వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివకేసింది. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వరప్రధాయనిగా ప్రజలు భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో దొంతుల లక్షీనారాయణ అనే వ్యక్తి వేసిన కేసును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆ పార్టీకి చెంప పెట్టు అని అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పవన్కుమార్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, కేకే మహేందర్రెడ్డిలతో పాటు రచనారెడ్డి వంటి వారు కాళేశ్వరం, పాలమూరు -రంగారెడ్డి తదితర ప్రాజెక్టులకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు వేసిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. ఆ కేసులను విచారించిన హైకోర్టు అవి తప్పుడు కేసులని కొట్టి వేస్తూ మొట్టికాయలేసినా కాంగ్రెస్ పార్టీకి బుద్ది రాలేదని ఆయన ధ్వజమెత్తారు. నిజానికి ఢిల్లీకి విమానాల్లో వెళ్లి సుప్రీంకోర్టు న్యాయవాదులకు లక్షలాది రూపాయల ఫీజులు చెల్లించే స్థోమత దొంతుల లక్షీనారాయణకు లేదని కర్నె పేర్కొంటూ ఆయన కేసు వేయడం వెనుక కాంగ్రెస్ ప్రోద్బలమే ఉందన్నారు. కాంగ్రెస్ నాయకుల వాదన ప్రజాక్షేత్రంలో నెగ్గగా ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, జీవన్రెడ్డి వంటి నాయకులు ప్రాజెక్టులకు సంబంధించి పాడిందే పాట అన్న విధంగా పాత విషయాలనే పదేపదే ప్రస్తావిస్తూ అవాస్తవాలు చెపుతున్నారని కర్నె ప్రభాకర్ దుయ్యబట్టారు. కాళేశ్వరం, తమ్మిడిహట్టి వేర్వేరు ప్రాజెక్టులన్న విషయం జీవన్రెడ్డి తెలుసుకొని మాట్లాడాలన్నారు. తమ ప్రభుత్వం ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టును కడుతూనే మరో వైపు 148 అడుగుల ఎత్తులో తమ్మిడిహట్టి ప్రాజెక్టును కట్టడానికి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నదని, ఇందుకు సంబంధించి ఎలాంటి వివాదాలు, అభ్యంతరాలు రాకుండా మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకుంటున్నదని ఆయన స్పష్టం చేశారు. తమ్మిడిహట్టి ప్రాజెక్టు ద్వారా నిజంగా తెలంగాణకు మేలు జరుగుతుందన్న భావన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే 2008లో శిలాఫలకం వేసి 2014 వరకు ఎందుకు తట్టెడుమట్టి తీసిన పాపానపోలేదని ఆయన నిలదీశారు. ప్రాజెక్టు కట్టాలన్న చిత్తశుద్దే ఉంటే రాష్ట్రంలో, మహరాష్ట్రలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండి కూడా ఎందుకు అనుమతులు తేలేకపోయారని, ఎందుకు మహరాష్ట్రను ఒప్పించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. తమ్మిడి హట్టి వద్ద పనులు ప్రారంభించకుండా ఎక్కడో సంబంధంలేని చోట కాలువలు, సొరంగాలు తవ్వి మొబిలైజేషన్ అడ్వాన్స్లు, పంపులు, పైపుల కొనుగోళ్లతో వేలకోట్లు దిగమింగిన అవినీతి చరిత్ర కాంగ్రెస్దన్నారు.
కాగా కాళేశ్వర ప్రాజెక్టు పర్యాటక ప్రాంతంగా మారిందని జీవన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధిస్తున్నానన్నారు. తిరుపతి, యాదాద్రి వెళ్లి ప్రజలు ఎలా దైవదర్శనం చేసుకుంటారో 40లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా నిర్మితమవుతూ తమ బతుకులు మార్చే ఆధునిక దేవాలయమైన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి ఆనందించాలని ప్రజలు తండోపతండాలుగా తరలుతున్నారని, పర్యాటక శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ప్రాజెక్టులు శిధిలావస్థకు చేరాయని, గేట్లకు గ్రీస్ రాసిన పాపాన కూడా పోలేదని, 42ఏండ్లు పాలించి ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణను ఎడారిగా మార్చారని కర్నె మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే తెలంగాణ అవసరాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ఒక గొప్ప సంకల్పంతో రీడిజైనింగ్ చేసి ప్రాజెక్టులను రూపొందించారని, ఆ ప్రాజెక్టులను గడువుకన్నా ముందే పూర్తి చేయడానికి మంత్రి హరీష్రావు ఆహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పడిన కేసుల విషయంలో ఓ వైపు న్యాయపరంగా పోరాడుతూనే మరో వైపు ఏడాది లోపే దాదాపు పది రకాల అనుమతులు పొందడం ప్రభుత్వ అంకితభావానికి నిదర్శనమన్నారు.ఇకనైనా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయకుండా కాంగ్రెస్ బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. లేకుంటే కాంగ్రెస్ భంగపాటు తప్పదని ఆయన హెచ్చరించారు.