తెలంగాణలో అడ్రస్ గల్లంతు అయిపోయి… ఉనికి కోసం పోరాటం చేస్తూ…పచ్చమీడియాకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ కొత్త కామెడీలు చేస్తోందనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ పార్టీ ఆటలో అరటిపండు అనే రీతిలో చిత్రవిచిత్రాలకు పూనుకుంటోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెట్టిన సందర్భంగా టీటీడీపీ చేస్తున్న అసందర్భ హల్చల్ గురించి.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం తొలిసారిగా అవిశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న సంగతి తెలిసిందే.నాలుగేళ్ల తర్వాత మోడీతో దోస్తానాకు ధోకా ఇచ్చిన చంద్రబాబు హఠాత్తుగా అసంతృప్తి గలం విప్పారు. అవిశ్వాసం పెట్టారు. అయితే, బాబు తీరును ఎందరో ఎండగడుతున్నారు. ఇన్నాళ్లు అంటకాగి ఇదేం బుద్ధని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే..సందట్లో సడేమియా లాగా టీటీడీపీ వచ్చి చేరింది. ఒక్కరంటే ఒక్కరు కూడా ఎంపీలు లేని తెలంగాణ టీడీపీకి చెందిన నాయకులు బృందంగా ఢిల్లీకి వెళ్తున్నారట. ఎందుకయ్య ఆంటే…టీఆరెస్ ఎంపీలతో కలిసి విభజన హామీలపై మాట్లాడాలని కోరుతారట. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తన బలమైన గలాన్ని వినిపిస్తున్న సమయంలో టీటీడీపీ నేతలు ఏం గుర్తుకు చేస్తారో వారికే తెలియాలి!
రేపు ఉదయం హైదరాబాద్ నుంచి హస్తినకు బయలుదేరనున్న బృందంలో పార్టీ నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, దేవేందర్ గౌడ్, పెద్దిరెడ్డి, నామా నాగేశ్వరరావు, వీరేందర్ గౌడ్ ఉన్నారు. ఢిల్లీకి వెళ్లనున్న టీటీడీపీ బృందంలో ఉన్న నాయకులు తాము ఇంకా రాజకీయాల్లో ఉన్నామని చెప్పుకొనేందుకే హస్తినకు వెళుతున్నారా అంటూ కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు. ఎందుకంటే…ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ నేతలకే లేని గుర్తింపు అడ్రస్ గల్లంతైన టీటీడీపీ నేతలకు ఎక్కడుంటుంది? టీటీడీపీ నేతల ఢిల్లీ పర్యటన ఎపిసోడ్ ఆటలో అరటిపండు వంటిదేనని నవ్వుకుంటున్నారు.