కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దేశ అత్యున్నత పౌర పురస్కారాలపై వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏండ్లయినా ఇప్పటివరకూ ఒక్క సాధువును కూడా భారతరత్న పురస్కారానికి ఎంపిక చేయలేదని యోగా గురువు బాబా రాందేవ్ విమర్శించగా, దిగువ మధ్య స్థాయి శాస్త్రవేత్తకు పద్మభూషణ్ ఇచ్చారని నంబి నారాయణన్ను ఉద్దేశిస్తూ కేరళ మాజీ డీజీపీ టీపీ సేన్కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వచ్చిన బాబా రాందేవ్ మీడియాతో మాట్లాడుతూ.. దయానంద మహర్షి, స్వామి వివేకానంద వంటి మహనీయులు దేశం కోసం చేసిన సేవలకంటే.. రాజకీయ నాయకులు, క్రీడాకారులు చేసిన సేవ ఎక్కువా? క్రైస్తవ మతానికి చెందిన వారు కావడం వల్లే మదర్ థెరెసాకు ఈ అవార్డు లభించింది. హిందువులైన కారణంగానే ఇతర సాధువులకు పురస్కారాలను తిరస్కరిస్తున్నారా? దేశంలో హిందువుగా ఉండడమే నేరమా? అని నిలదీశారు. మరోవైపు గూఢచర్య అభియోగాల నుంచి గతేడాదే బయటపడ్డ ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్కు పద్మభూషణ్ ఇవ్వడంపై 1994లో ఆయనపై విచారణ చేపట్టిన కేరళ మాజీ డీజీపీ సేన్కుమార్ విమర్శలు గుప్పించారు. నంబి నారాయణన్ను దిగువ మధ్య స్థాయి శాస్త్రవేత్తగా పేర్కొన్న ఆయన.. అత్యున్నత పురస్కారాన్ని పొందేందుకు ఆయన ఏం సాధించారని ప్రశ్నించారు. ఇదిలాగే కొనసాగితే వచ్చే ఏడాది నుంచి నేరగాళ్లకు కూడా పద్మ పురస్కారాలు వస్తాయని వ్యాఖ్యానించారు. నారాయణన్పై సుప్రీంకోర్టు కమిటీ విచారణ పూర్తయిన తర్వాత ఆయన నిర్దోషిగా తేలితే భారతరత్న ఇచ్చినా అభ్యంతరం లేదని చెప్పారు. కాగా, అసోంకు చెందిన ప్రముఖ గాయకులు భూపేన్ హజారికాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ లోక్సభా పక్ష నేత మల్లికార్జున్ ఖర్గేపై కేసు నమోదైంది. గాయకుడు (భూపేన్ హజారికా), ఆరెస్సెస్ వ్యక్తికి (నానాజీ దేశ్ముఖ్) బదులు ఇటీవల కన్నుమూసిన ఆధ్యాత్మిక వేత్త శివకుమార స్వామికి భారతరత్న ఇవ్వాల్సిందని ఖర్గే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అసోం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆర్టీఐ కార్యకర్త ఒకరు ఖర్గేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు భారతరత్న పురస్కారాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం గాయకుడు జుబీన్ గార్గ్పైనా కేసు నమోదైంది.
