అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లోని ఓ టీవీ ఛానల్పై మంగళవారం ఉదయం దాడి జరిగింది. స్థానిక శంషాద్ టీవీ ఛానల్ భవనంలోకి చొరబడ్డ కొందరు దుండగులు బాంబులు, కాల్పులతో విరుచుపడ్డారు. దీంతో ఛానల్ సిబ్బంది భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని.. కొందరు సిబ్బంది ఇంకా భవనం లోపలే ఉన్నారని టీవీ ఛానల్లో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు చెప్పారు. లోపల వంద మందికిపైగా ఉన్నట్లు తెలుస్తోంది.
‘ముగ్గురు దుండగులు భవనంలోకి చొరబడ్డారు. ముందు సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత లోపలికి వచ్చిన ఆగంతకులు గ్రనేడ్లు విసురుతూ తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు’ అని దాడి నుంచి బయటపడ్డ సిబ్బంది ఒకరు చెప్పారు. దుండగులు దాడి చేస్తుండగా తాను వెనుక డోర్ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. సమాచారమందుకున్న భద్రతాసిబ్బంది టీవీ ఛానల్ వద్దకు చేరుకుని భవనాన్ని చుట్టుముట్టారు. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది సిబ్బంది దుండగుల అధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది.
