సంచనలంసృష్టించిన తల్లిని చంపిన కీర్తి కేసులో ఎన్నో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. హయత్నగర్ పోలీస్ స్టేషన్లో దాదాపు వారం రోజుల క్రితం మిస్సింగ్ కేసుగా నమోదై… ఆ తర్వాత మలుపులు తిరుగుతూ మూడు కేసులుగా మారిందీ వ్యవహారం. వీటిలోని ఒక్కో కేసులో కీర్తి ‘పాత్ర’ ఒక్కో రకంగా ఉంది.మొత్తమ్మీద అక్టోబర్ 26న రాత్రి 8గంటలకు ఫిర్యాదు దారుగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన కీర్తి… ఆపై అనుమానితురాలిగా, నిందితురాలిగా మారి బాధితురాలిగానూ ‘అవతారం’ ఎత్తింది. రజిత హత్య జరగడానికి కారణాలు, దాని పూర్వాపరాలు తెలుసుకున్న హయత్నగర్ పోలీసులు మరో రెండు దారుణాలను గుర్తించారు. కీర్తి మైనర్గా ఉన్నప్పుడే బాల్రెడ్డితో పాటు శశికుమార్ ఆమెపై అత్యాచారం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి దారుణాలపై సమాచారం ఉంటే పోలీసులు తక్షణమే కేసు నమోదు చేయాలనే నిబంధన ఉంది. దీంతో హత్య కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న హయత్నగర్ ఇన్స్పెక్టర్ సతీష్ ఫిర్యాదిగా మారారు. ఆయన ఫిర్యాదుతో సుమోటోగా రెండు పోక్సో యాక్ట్ (మైనర్పై అత్యాచారానికి సంబంధించి) కేసులు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్ నెం.659/2019, 660/2019లతో నమోదైన వీటిలో కీర్తి బాధితురాలిగా ఉంది. వీటిలో మొదటి కేసులో బాల్రెడ్డిని, రెండో దాంట్లో శశిని అరెస్టు చేశారు. అయితే ఈ కేసుల ప్రకంపనలు పొరుగున ఉన్న ఆమన్గల్లును తాకాయి. మైనర్గా ఉన్న కీర్తిని గర్భవతిని చేసిన బాల్రెడ్డి అప్పట్లో అబార్షన్ చేయించాడు. శశికుమార్తో కలిసి కారులో ఆమన్గల్లులోని పద్మ నర్సింగ్ హోమ్లో ఈ చట్ట విరుద్ధమైన పని జరిగింది. ఈ విషయం హయత్నగర్ పోలీసుల దర్యాప్తులో వెలుగులోకివచ్చింది. దీంతో పోలీసులు ఆ ఆస్పత్రి నిర్వాహకులనూ నిందితులుగా చేర్చడానికి నిర్ణయించారు. దీనిపై పోలీసుల నుంచి సమాచారం అందుకున్న రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు శుక్రవారం ఆ ఆసుపత్రిపై దాడి చేసి సీజ్ చేశారు.
