ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ స్టేడియంలో ప్రత్యక్షమయ్యాడు. గురువారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామానికి వెళుతూ మార్గమధ్యలో అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ స్టేడియంను అతడు సందర్శించాడు. క్రీడా వసతులను పరిశీలించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్డీటీ క్రికెట్ స్టేడియం అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. ఇండియాలో క్రికెట్ను బాగా ఆరాధిస్తున్నారని వ్యాఖ్యానించాడు.ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో భారత జట్టు ప్రదర్శన చాలా బాగుందని, మిగిలిన జట్లకు టీమిండియా ప్రమాదకరంగా మారిందన్నారు. అతడి వెంట ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ తదితరులు ఉన్నారు. కాగా, కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామం సోలార్ విద్యుత్ సదుపాయం ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైంది. విలేజ్ ఎనర్జీ సంస్థ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు గిల్క్రిస్ట్ ఇక్కడికి వచ్చారు.
