ఒక వైపు స్కాములతో భ్రూణ హత్యలతో.. వరకట్న చావులతో.. పుట్టిన పసిపాపలను నీళ్లలో పడవేసే సంస్కృతిలో నగరాలు నాల్గడుగుల ముందున్నాయి. మరో వైపు మనస్సు లేని మనుషుల మధ్య మంచితనాన్ని కాటేసే కాలనాగుల మధ్య నలిగిపోతూ మానవత్వం మరో వైపునకు అడుగులు వేస్తోంది అన్నాడో మహాకవి. సరిగ్గా ఈ వ్యాఖ్యలను రుజువు చేస్తూ కడప జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది.
నవమాసాలు మోసి, నవ శిశువుకు జన్మనిచ్చిన ఓ తల్లి మానవత్వాన్ని మరిచింది. బిడ్డకు వెచ్చని ఒడిని పంచాల్సిన ఆ తల్లి తన కర్కశత్వాన్ని చూపించింది. నవ మాసాలపాటు గర్భంలో ఆ శిశువు కన్న కలలను చెల్లా చెదురు చేస్తూ నడిరోడ్డుపై వదిలేసింది. అమ్మచేతి గోరు ముద్దలు తినాలని, అమ్మ ఒడిలో నిద్రించాలని, అందరి పిల్లల్లా ఆడుకోవాలని కన్న ఆ శిశువు కలలను ఆవిరి చేసింది. మరో అడుగు ముందుకేసిన ఆ నీచురాలు అమ్మ తనాన్ని మరిచి బిడ్డను కుక్కలకు ఆహారంగా వేసింది. శరీర భాగాలన్నీ బాగానే ఉన్నాయిగా, చూడ్డానికి ముద్దొస్తున్నానుగా.. అయినా నన్నెందుకమ్మా కుక్కలకు ఆహారంగా వేశావు అంటూ ప్రశ్నించలేని ఆ శిశువును చూసిన ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. బహుశా అమ్మ అనే పదానికి అర్థం తెలియని తల్లికి పుట్టడం ఆ శిశువు చేసుకున్న పాపమేమో అనుకుంటున్నారు ఈ సంఘటన చూసిన వారంతా.
కడపలో గల రిమ్స్ సబ్ స్టేషన్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. ఓ గుర్తు తెలియని మహిళ రిమ్స్ సబ్ స్టేషన్ పరిధిలోగల ఓ రోడ్డుపై ముక్కుపచ్చలారని మగ శిశువును వదిలేసి వెళ్లింది. దీంతో ఆ శిశువు ఆకలితో ఏడ్చినా.. ఆ తల్లి కనుకరించలేదు. చివరకు ఆ శిశువు ఏడుపే తన ప్రాణం తీసేలా చేసింది. శిశువు ఏడుపు విన్న ఓ కుక్క అటువైపుగా వచ్చి నోటితో కరుచుకొని వెళ్లింది. ఈ ఘటనను చూసిన ఓ వ్యక్తి కుక్కను తరిమాడు. అయితే, అప్పటికే ఆ శిశువు మరణించింది. ఈ ఘటన చూసిన వారి కంట కన్నీరు ఆగకపోవడం గమనార్హం.