కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలంతా ఏకంకావాలని డీజీపీ ఎం మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. లాక్డౌన్ను విజయవంతంగా పాటించడంలోనూ పోలీసులకు సహకరించాలని కోరారు. గురువారం డీజీపీ కార్యాలయం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది.
మానవాళికి చాలెంజ్ విసిరిన కరోనాను ఓడించడంలో ప్రజలు అందిస్తున్న సహకారం మరువలేనిదని డీజీపీ పేర్కొన్నారు. సమాజంలో ఇలాంటి విపత్తును ఎదుర్కోవడంలో అందరి కృషి, చొరవ.. పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తున్నదని, మరింత ఉత్సాహంగా పోలీసులు పనిచేసేలా సహకరించాలని విజ్ఞప్తిచేశారు.
లాక్డౌన్ను విజయవంతం చేయడంలో, కరోనా బాధితులను గుర్తించడంలో, వారి ద్వారా ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర పోలీసులు కృషి చేస్తున్నారని చెప్పారు. అందరూ నిర్ణీత దూరాన్ని తప్పక పాటించాలని డీజీపీ కోరారు.