ఆంద్రప్రదేశ్ లో జరిగే వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ కు 10 ఓట్లు కూడా పడవని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొడుకు జేసీ పవన్ రెడ్డి అన్నారు. కుంటుకుంటూ నడుస్తూ… కమ్యూనిస్టులను ఒక కర్రగా, మరో పార్టీని మరో కర్రగా ఉపయోగించుకుంటూ అడుగులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో అన్ని నియోజక వర్గాలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేనకు అభ్యర్థులు కూడా లేరని అన్నారు. టీడీపీ, వైసీపీలో టికెట్లు రాని వారే జనసేనలో చేరుతారని అన్నారు. అంతేకాదు పవన్ కల్యాణ్ తో తనకు కొంచెం పరిచయం ఉందని పవన్ రెడ్డి తెలిపారు. గుంటూరులో బహిరంగసభ సందర్భంగా పవన్ కల్యాణ్ ఏం మాట్లాడారో అందరికీ గుర్తుండే ఉంటుందని చెప్పారు. లూజ్ కనెక్షన్ ఏర్పడిందో ఏమో కానీ… సడన్ గా యూటర్న్ తీసుకుని మంత్రి లోకేష్ ని టార్గెట్ చేశారని విమర్శించారు. తాను అప్పుడు టీవీని చూస్తూనే ఉన్నానని… లోకేష్ ను విమర్శించిన తర్వాత షాక్ అయ్యాను అన్నారు. అంతకు ముందు రోజు వరకు టీడీపీతో సఖ్యతగా ఉండి, రాత్రికి రాత్రే పవన్ మారిపోయారని పవన్ రెడ్డి అన్నారు. తనకు ఉన్న సమాచారం మేరకు, ఢిల్లీ నుంచి పవన్ కు ఫోన్ వచ్చిందని చెప్పారు. ‘మీరు టీడీపీతో ఉండకూడదు… మీకు ఎంత కావాలంటే అంత ముడుతుంది’ అనేది ఫోన్ కాల్ సారాంశమని తెలిపారు. దీంతో పవన్ కల్యాణ్ టీడీపీని టార్గెట్ చేశారని జేసీ పవన్ రెడ్డి చెప్పారు.
