ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర గురువారం యలమంచలి నియోజకవర్గంలో అడుగుపెట్టనుంది. ఈ నెల 14న జిల్లాలో ప్రవేశించిన పాదయాత్ర నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో ముగిసి యలమంచలిలో ప్రవేశించనుంది. గురువారం పాయకరావుపేట మండలం ఎస్.రాయవరం మండలం దార్లపూడి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర ఏటికొప్పాక వద్ద యలమించిలిలో అడుగు పెట్టనుంది. తొలిరోజు ఏటికొప్పాక, పధ్మనాభరాజుపేట, పులపర్తి మీదుగా పురుషోత్త పురం వరకు సాగనుంది. నర్సీపట్నం తర్వాత అత్యధిక రోజులు యలమంచలిలోనే యాత్ర సాగే అవకాశాలున్నాయి. నియోజకవర్గంలోని యలమంచలి మున్సిపాల్టీ, యలమంచలి, రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలాల్లో 40 కిలోమీటర్లకు పైగా ప్రజాసంకల్పయాత్ర సాగనుంది. యలమంచలి కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి రాజు (కన్నబాబురాజు) ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వై.ఎస్.జగన్కు ఘన స్వాగతం పలకడంతో పాటు నియోజకవర్గంలో పాదయాత్ర విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. అధికార టీడీపీ హాయంలో గత నాలుగున్నరేళ్లలో సాగిన అవినీతి అక్రమాలు, అంతులేని వివక్షతో విసిగిపోయిన ప్రజలు తమ కష్టాలను వైఎస్ జగన్ తో చెప్పుకొని ఉపశమనం పొందేందుకు ఎదురు చూస్తున్నారు. జగన్ భరోసా కోసం ఎదురుచూపుచూస్తున్నారు.
